సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sodd) పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్రం పొడిగించింది. కొత్త సీబీఐ డెరెక్టర్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నియామకానికి అపాయింట్స్ కమిటీ ఆప్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1986 కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలపరిమితి మే 24వ తేదీతో ముగియాల్సి ఉంది.
కొత్త సీబీఐ బాస్ ఎన్నిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ వారం మొదట్లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీజేఐ సంజీవ్ ఖన్నా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో సీబీఐ కొత్త చీఫ్ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రవీణ్ సూద్ 1986లో ఐపీఎస్లో చేరారు. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందించారు. అనంతరం బంగళూరు డీసీపీగా పనిచేశారు. 1999 నుంచి మూడేళ్ల పాటు మారిషస్లో డిప్యుటేషన్ మీద పనిచేశారు.
సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం, 6 నెలల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్న వారిని సీబీఐ డెరెక్టర్ పదవికి పరిశీలించరాదు. సీబీఐ డెరెక్టర్ పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. అపాయింట్మెంట్ కమిటీ సమ్మతితో మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. సీబీఐ డెరెక్టర్ పదవీకాలాన్ని 2003 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ రెండేళ్లుగా ఫిక్స్ చేసింది.