బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ యాంకర్ శ్యామల, పండు, పద్మావతి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి వంటి వారితోసహా మొత్తం 25 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక ప్రైవేటు కంప్లెయింట్ ఆధారంగా మియాపూర్ పోలీసులు ఈ కేసు నమోదుచేశారు.
సినీ నటులు వివిధ ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండటం సహజమే. సామాన్య జనం తమ అభిమాన నటులు చెప్పినదానికి తొందరగా ప్రభావితులవుతారు. ఆ రకంగా సినీ తారలు ప్రచారం ఇచ్చే ప్రొడక్ట్స్ కి తొందరగా ప్రాచుర్యం కలిగి మార్కెట్లో ఆ ప్రొడక్ట్స్ అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఆయా ప్రొడక్ట్స్ గురించి ఇంతదింత చేసి తమకిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తారలు “నటిస్తారు”. అది నటన అని భావించనివారు ఆ నటన ప్రభావంలో పడొచ్చు.
కళ్యాణ్ జువెలర్స్ క్వాలిటీకి తాను పర్సనల్గా పూచీ పడతానని నాగార్జున అంటారు. కానీ దాని మీద ఏవో ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు? అదేదో హెయిర్ ఫాల్ నిరోధించే లోషన్ కోసం తాను స్వయంగా ఆ ఫ్యాక్టరీకి వెళ్లి పరీక్షించానని, దాని నాణ్యతకి తనదే బాధ్యత అని మహేష్ బాబు అంటారు. నాగార్జున యూనివర్సిటీ పక్కన, రామకృష్ణ వెనీజియం అనే బహుళ అంతస్తుల మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి మహేష్ బాబే బ్రాండ్ అంబాసడర్. ఆ బిల్డర్లు చేతులెత్తేసినప్పుడు తప్పుకుంటే మహేష్ బాబు ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకేం సంబంధం లేదని ఆయన టీం అంటున్నదట. డబ్బులు ఇవ్వాలే కానీ బోగస్ ప్రొడక్ట్స్ కి, బెట్టింగ్ యాప్స్ కి కూడా ప్రచారం చేసిపెట్టే డబ్బు దెయ్యం పట్టిన లకలకగాళ్లే వీళ్లంతా!
సినిమా యాక్టరు కేవలం డబ్బులకోసమే సినిమాల్లో అయినా, యాడ్స్ లో అయినా ఒకే రకంగా నటిస్తారు. రెండు చోట్లా వాళ్లకి సామాజిక బాధ్యత ఉంటుందని మనం ఆశించడం తక్కువ. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, సచిన్, ధోని వంటి క్రికెటర్లకైనా, ఎవరికైనా జనం ఆరోగ్యం, డబ్బు, నష్టం పట్ల పట్టింపు వుండదు. ఉంటే వాళ్ళు కూల్ డ్రింక్ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టరు. వాళ్లకి డబ్బులొస్తే చాలు. ఎన్ని అభూత కల్పలనల్ని, అబద్ధాల్ని చెప్పడానికి సంకోచించరు. అదేమంటే చట్టబద్ధంగా సంపాదిస్తున్నామని బుకాయిస్తారు. అన్ని సందర్భాల్లోనూ చట్టమే ప్రామాణికం కాదు. ముందు నైతిక విలువలు ప్రామాణికం. ఆ తరువాతే చట్టం! ఈ మాత్రం ఇంగితం, నైతిక నిబద్ధత వీరి నుండి ఆశించడం అత్యాషే కావచ్చు. అందుకే జనం అప్రమత్తంగా ఉండాలి.
ఈ సందర్భంగా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ లేకపోవు. ఇండియన్ బాడ్మింటన్ లెజండ్ పుల్లెల గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో (తాను పీక్ లో వున్న సమయంలోనే), తనని ఓ కూల్ డ్రింక్ కంపెనీవారు బ్రాండ్ అంబాసిడర్ గా వుండమంటే తాను తిరస్కరించానని చెప్పారు. పైగా ఆయన వేసవిలో కొబ్బరి బోండాలు తాగి ఆరోగ్యం కాపాడుకోమని ఉచితంగా చేసిన యాడ్ (అప్పట్లో టీవీ9 అనుకుంటా) వచ్చింది. అందరికీ ఇంతటి చిత్తశుద్ధి, నైతిక నిబద్ధత ఉండొద్దూ..!?
~ అరణ్య కృష్ణ