మహారాష్ట్రలోని పుణే నగరానికి మెట్రో రైలు విస్తరణకు కేంద్ర మంత్రి వర్గంఆమోదం తెలుపగా, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు. పుణే మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్ మెట్రో రెండో దశ’ఎ’భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రానికి సమర్పించి ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని పలుసార్లు కలిసి విన్నవించారు. ఇటీవలి కాలంలో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిని కూడా సీఎం కలసి,మెట్రో విస్తరణకు కేంద్ర ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పుణె – ప్రయాణికుల సంఖ్య తక్కువ అయినా ఆమోదం
ఈ ప్రాజెక్టు పూర్తైతే రోజుకు సుమారు 8 లక్షల మందికి ఆధునిక, కాలుష్యరహిత రవాణా సౌకర్యాలు లభించనున్నాయని వివరించారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపాదన కేంద్ర పరిశీలనలో ఉందని సమాచారం. పుణే మెట్రో రెండో దశ పూర్తయితే 2027 నాటికి రోజుకు 96,000 మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నా ఆ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగా, హైదరాబాద్ మెట్రో విస్తరణను — ఇది రోజుకు 8 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిఉన్నా — విస్మరించడం తగదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
మెట్రో 2(ఏ) ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యయం రూ.24,269 కోట్లు కాగా, దానిలో 30 శాతం అయిన రూ.7,313 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కేంద్రం మాత్రం 18శాతం మేరకు రూ.4,230కోట్ల సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
మిగిలిన 48శాతం నిధులు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ)వంటి ఆర్థిక సంస్థల ద్వారా రుణంగా సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందించారు. అదనంగా మిగిలిన 4 శాతాన్ని పీపీపీ మోడల్ ద్వారా సమకూర్చేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు.