ఈ సామూహిక విషాదాలకు అంతు ఎక్కడ?
హైదరాబాద్ హబ్సిగుడా ప్రాంతంలో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్చిపోకముందే, చెన్నైలో ఇలాంటిదే మరో సంఘటన గురువారం నాడు చోటుచేసుకున్నది. ఈ మరణాలకు కూడా ఆర్ధిక ఇబ్బందులే కారణంకావడం గమనార్హం.
చెన్నైలోని అన్నానగర్ లో డా.బాలమురుగన్ ఒక స్కాన్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్కాన్ సెంటర్ వల్ల భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు, ఋణభారం భరించలేక సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. డా.బాలమురుగన్, సిటీ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన భార్య సుమతి, 12వ తరగతి పరీక్షలు రాస్తున్న 17 ఏళ్ల పెద్ద కుమారుడు దుశ్యంత్, పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల రెండవ కుమారుడు లింగేష్ ఉరివేసుకొని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న గురువారం డాక్టర్ బాలమురుగన్ ఇంటికి వారి కార్ డ్రైవర్ వెళ్లినప్పుడు తలుపులు తీయకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కలవారిని అప్రమత్తంచేసి కిటికీ తలుపులు తెరిచి చూడగా ఒక గదిలో డా.బాలమురుగన్ దంపతులు, మరో గదిలో వారి ఇద్దరి పిల్లలు ఉరేసుకొని వేలాడుతూ నిర్జీవులుగా కనిపించారు.
సమాచారం అందుకున్న సిటీ పోలీసులు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకొని, శవాలను పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి పంపారు.
కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నది. పెద్దలకు వారి వైఫల్యాలు, నిస్పృహలు వారికి ఉండొచ్చు. కానీ పిల్లల్ని కూడా ఎందుకు చంపుకుంటున్నారో, అసలు ఎలా చంపగలుగుతున్నారో లేదా చచ్చిపోవడానికి సిద్ధం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఈ సంఘటనలో ఆత్మహత్య చేసుకున్నవారు చిన్నవాళ్లేం కారు, విద్యాధికులు. వారిలో ఒకరు డాక్టర్ కాగా, మరొకరు లాయర్. పిల్లలకి 17 ఏళ్లు వచ్చాక, మరొక్క నాలుగైదేళ్లు ఓపిక పడితే వారు వృద్ధిలోకి వస్తారు, ఇబ్బందుల నుండి బైటపడే అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా ఆ విద్యాధికులైన దంపతులకి ఎందుకు కలగలేదో అర్ధంకావట్లేదు. తమ ప్రాణాలతోపాటు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడానికి వారు కారకులయ్యారు. మనసు కలచివేసే ఇలాంటి విషాదాలు వినపడని రోజుకోసం ఎదురుచూద్దాం.