నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై రూ.60.48 కోట్ల మోసం ఆరోపణలతో కేసు నమోదైంది. దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, ఆర్థిక నేరాల విభాగం (EOW)కి బదిలీ అయింది. 2015లో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం రూ.75 కోట్ల రుణం కోరిన శిల్పా, రాజ్ దంపతులు, పన్ను ఆదా కోసం దానిని పెట్టుబడిగా మార్చమని ఒప్పించారని, నెలవారీ రాబడి, మూలధనం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని కొఠారి ఆరోపించారు. 2015 ఏప్రిల్లో రూ.31.95 కోట్లు, సెప్టెంబర్లో రూ.28.53 కోట్లు బెస్ట్ డీల్ టీవీ ఖాతాలకు బదిలీ చేశారు. 2016లో శిల్పా వ్యక్తిగత హామీ ఇచ్చినప్పటికీ, సెప్టెంబర్లో డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేశారు. 2017లో కంపెనీ దివాలా తీసినట్లు తెలిసింది. కొఠారి డబ్బు తిరిగి పొందే ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిధులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారని ఆరోపించారు. EOW ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది.
శిల్పా, రాజ్ లాయర్ ప్రశాంత్ పాటిల్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారం సివిల్ స్వభావం కలిగినదని, 2024 అక్టోబర్లో NCLT ముంబయి తీర్పు ఇచ్చిందని, ఎటువంటి నేరం జరగలేదని, ఆరోపణలు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకేనని పేర్కొన్నారు.


