ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు అందించిన ఇంజినీరింగ్ కళాశాలలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని, పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ ప్రారంభించాలని స్పష్టం చేశారు. గత సర్కారు తీరులా కాకుండా కళాశాలల దందాను నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం బుధవారం 3 గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం. ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు.
ఈసారి పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, అడ్వొకేట్ జనరల్ను, ఇతర న్యాయ నిపుణులను సంప్రదించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ప్రవేశాల కమిటీ ఛైర్మన్ అయిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని సీఎం సమీక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది.