హైదరాబాద్లోని జలసౌధలో బుధవారం రాత్రి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో చేసిన విధంగా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా అన్నట్లు సమాచారం. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలు పూర్తయి పంపుహౌస్ పనులు ప్రారంభమైన తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులు పెట్టాలని మహబూబ్ నగర్ సీఈకి సీఎం సూచించారు. అక్కడ చేసినట్లు (ఆయన కాళేశ్వరంలో ఇంతకు ముందు ఎస్ఈగా పనిచేశారు) ఇక్కడ కూడా చేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్న వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కేసులకు సంబంధం లేని వారు భయపడనవసరంలేదని భరోసా ఇచ్చారు.
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఒకటికి రెండుసార్లు తప్పులు లేకుండా సరి చూసుకోవాలని, గతంలో పొరపాట్లు చేసిన వారిపై విజిలెన్స్ కేసులవుతున్న దృష్ట్యా జాగ్రత్తగా పని చేయాలంటూ.. సీఎం ఉద్బోధ చేసినట్లు తెలిసింది. ఒప్పంద సేవల ఉద్యోగుల వేతనాలపై అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. అవసరం ఉన్నంత వరకే కాంట్రాక్టు సిబ్బందిని తీసుకోవాలని, దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, ప్రతిపాదనలు వచ్చాక పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టుల ఓ అండ్ ఎం పెండింగ్ బిల్లులకు నెలకు రూ.50 కోట్లు, నిర్వహణకు రూ.75 కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. శిక్షణ సంస్థ వాలంతరికి రూ.10 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టు – ఎన్జీటీ సంబంధిత పనులకు రూ.10 కోట్లు, దేవాదుల ఎత్తిపోతల పూర్తికి రూ.2 వేల కోట్లు అవసరం అని సీఎంకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం.