జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తాజాగా సమర్థించారు. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో (Indonesia) పర్యటించిన ఖుర్షీద్ ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేది.
ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి జమ్ముకశ్మీర్ వేరుగా ఉందనే భావన చాలా కాలంగా ఉంది. తాము విడిగా ఉన్నామనే అభిప్రాయం అక్కడ చాలామందిలో ఉండేది. అయితే, 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన తొలిగిపోయింది. ఈ నిర్ణయం జమ్ము కశ్మీర్లో అభివృద్ధికి బాటలు వేస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశాక అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 65 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని’ అని ఖుర్షీద్ అన్నారు.