బ్యాంకాక్ కపంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ MLA కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒక వివాహ విందుకు హాజరయ్యేందుకు రామగుండం MLA రాజ్ ఠాకూర్ భార్య మానాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధీశ్ రెండు రోజుల క్రితం బ్యాంకాక్ వెళ్లారు. బ్యాంకాక్ నగరంలోని నోవాటెల్ హోటల్లో వీరు నివాసం ఉన్నారు. హోటల్ మెుత్తం 38 అంతస్తులలో ఉండగా, 35వ అంతస్తులో రూం తీసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ వివరాలను ఆమె మీడియాతో షేర్ చేసుకున్నారు.
హోటల్ గదిలో ఉండగానే పెద్దగా కేకలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూసేసరికి పక్కనే ఉన్న పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోతూ కనిపించాయి. ఆ సమయంలో గుండె ఆగిపోయినంత పనైంది. నేను, నా పిల్లలు భయంతో గజగజ వణికిపోయాం. 35వ అంతస్తులో ఉన్న మేం మెట్ల మార్గంలో వేగంగా పరుగెత్తుకుంటూ కిందికి చేరుకున్నాం. కిందకు వచ్చే క్రమంలో హోటల్ పై కప్పు పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. బయటకు వచ్చి చూశాక మేం నివాసం ఉన్న హోటల్ భవనం ఒకవైపు ఒరిగిపోయి కనిపించింది. ఓ దశలో మేం మా ప్రాణాలమీద పూర్తిగా ఆశలు వదులుకున్నాం. దేవుడి దయ వల్ల నాకు, నా పిల్లలకు, మాతోపాటు హోటల్లో నివాసం ఉన్న వారెవరికీ ఏమీ కాలేదు. అని తమ భయంకరమైన అనుభవాన్ని వెల్లడించారు. కాగా ఈ ఘటన గురించి తెలిసి షాక్కు గురయ్యాయని MLA రాజ్ ఠాకూర్ వెల్లడించారు. తన కుటుంబం క్షేమంగా బయటపడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.