అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 26% సుంకాలు విధించిన విషయం తెలిసిందే
అమెరికాకు మనదేశం నుంచి కొన్ని కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. ట్రంప్ వీటిపై 27.83% సుంకాలు అమలు చేసే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో రొయ్యల ధర పెరుగుతుంది. మనదేశం నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో ఇక్కడ రొయ్యల ధరలు తగ్గుతాయి. దీంతో రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం అప్పుడే పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
APలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో రొయ్యల ధర రూ.40కి దిగజారింది
మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏడాది 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. అందులో ఏకంగా, 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో దీనిపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 కాగా, ఆ మరుసటి రోజే రూ.200కి పడిపోయింది.
మామూలుగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలే USకు పంపుతారు
ట్రంప్ విధించిన సుంకాలను వంకలు గా చూపిస్తూ వాటిపై గరిష్ఠంగా కిలోకి రూ.30-40 వరకు తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ముఖ్యంగా వనామీ రొయ్యపై ఎగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతులు పండించే రొయ్యల ఉత్పత్తులను కొన్నిరోజులపాటు నిలిపివేయాలన్న ఎగుమతిదారుల నిర్ణయం, రైతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. దాంతో కిలో రొయ్యలకు రూ.40 వరకు ఎగుమతి సుంకం పడుతుందనే పేరుతో రొయ్యల కొనుగోళ్లు నిలిపివేశారు.
ఏప్రిల్ 15 నుంచి రొయ్యల ధరలు మరింత తగ్గుతాయనే ప్రచారానికి తెర లేపారు
దాంతో రొయ్యల రైతులు ఉత్పత్తి అయిన వాటిని అయినకాడికి అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. వ్యాపారులు మాత్రం సిండికేట్గా నోరు మెదపడం లేదు. ఆర్డర్లు చెప్పడం లేదు. దాంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొంది. అధిక సాగు ఉన్న కోనసీమలో తీరప్రాంత మండలాల నుంచి ప్రతీ రోజు వేలాది టన్నుల రొయ్యలు వివిధ కంపెనీలకు ఎగుమతి అవుతాయి.
రాష్ట్రంలోనే పేరుపొందిన ప్రముఖ కంపెనీలు ఈ ప్రాంతం నుంచి రొయ్యల కొనుగోలు చేస్తాయి
ట్రంప్ పేరుతో తమ పై ఎగుమతి సుంకం పడుతుందనే నెపంతో ఎగుమతి దారులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, ప్రస్తుతానికి కొనుగోలు నిలిపి వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతానికి కిలోకి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం చేస్తూ రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 30 నుంచి 50 పై కౌంటు రొయ్యలు మాత్రమే అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతులు అవుతాయి. అయితే 80 నుంచి వంద కౌంటు వరకు రొయ్యలు ఎగుమతులకు పనికిరావని సాకుచూపి రేటు భారీగా తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వంద కౌంటు రొయ్యలు రూ.220 ధరకు కొనుగోలు చేస్తుండగా, 90 కౌంట్ రూ.230, 80 కౌంట్ రూ.250, 70 కౌంట్ రూ.270, 60 కౌంట్ రూ.300, 50 కౌంట్ రూ.330, 40 కౌంట్ రూ.360, 30 కౌంట్ రూ.450 ధరలు ఉండగా ఇవి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం రొయ్యల రైతులకు భరోసా కల్పించాలని, అత్యధిక విదేశీ మారకద్రవ్యం ఆర్జించే పెద్ద రంగం ఆక్వా కాబట్టి ప్రభుత్వం ఆక్వా రైతులకు బాసటగా నిలబడాలని ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు త్సవటపల్లి నాగభూషణం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న విద్యుత్ రాయితీలు వర్తింపచేయాలని, గత ప్రభుత్వంలో దారుణంగా పెంచిన రొయ్య ఫీడు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కొనుగోలుదారులతో చర్చించి రొయ్యలు కొనే ఏర్పాట్లు చేయాలని కోరారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతుల్లోనూ ఇదే ఆందోళన నెలకొంది.