ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మూర్చలోకి జారుకుని, నోటి నుండి నురగ రావడంతో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు. సరిగ్గా అదే సమయంలో.. అదే విమానంలో ప్రయాణిస్తున్న నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించారు.
ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ ప్రీతి రెడ్డి తక్షణమే వృద్ధుడి వద్దకు చేరుకున్నారు. ఆయనను పరీక్షించి పల్స్ బలహీనంగా ఉండటంతో పాటు రక్తపోటు కూడా బాగా తగ్గిపోయిందని నిర్ధారించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆమె వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR ) చేయడం ప్రారంభించారు. డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించడం.. ఆమె వృత్తి కూడా వైద్యం కావడంతో కొద్ది నిమిషాల్లోనే వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు. ప్రాథమికంగా ప్రమాదం తప్పడంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.