ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పోలీసులు బహిరంగ నేరాలను గుర్తించడంలో, నిరోధించడంలో ఆధునిక సాంకేతికతని ఉపయోగిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ వెనుక వైపు ఇద్దరు యువకులు ఖాళీ ప్రదేశంలో కూర్చొని తీరిగ్గా మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాని ఎగరేసి వారి ‘సరదా’ని రికార్డ్ చేయడం మొదలెట్టారు. అది గమనించిన యువకుల్లో ఒకరు పరిగెత్తి కొంత దూరంలో వున్న చెట్టు కింద కనబడకుండా నిలబడ్డాడు. ఐనా అక్కడికి కూడా డ్రోన్ అతడిని వెంటాడింది. ఇంక లాభం లేదని వారిద్ద్దరూ మామూలుగా మోటార్ సైకిల్ ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన వీడియోకి కృష్ణా జిల్లా పోలీసులు మన్మధుడు సినిమాలోని బిజిఎం జోడించి తమ ‘ఎక్శ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఏపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్ ‘ ఖాతాలో రీపోస్ట్ చేస్తూ “సారీ గైస్! మీకెవరూ సహాయం చేయలేరు. పోలీస్ డ్రోన్స్ తమ విధిని తాము నిర్వర్తిస్తున్నాయి” అనే తమాషా వ్యాఖ్య జత చేశారు.
ఈ మధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా నేరాల నియంత్రణకు విజిలెన్స్ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.