యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో దుబాయ్లోని క్రిమినల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు భారీ జరిమానా, ఆస్తుల జప్తునకు ఆదేశించడంతో పాటు, శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కూడా తీర్పు వెలువరించింది.
ఆర్ఎస్జీ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన 53 ఏళ్ల బల్వీందర్ సింగ్ సాహ్నీ, మరికొందరు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ 2024లో కేసు నమోదైంది. నకిలీ కంపెనీలు (షెల్ కంపెనీలు), ఫోర్జరీ చేసిన ఇన్వాయిస్ల ద్వారా సాహ్నీ సుమారు 150 మిలియన్ దిర్హమ్లను (భారత కరెన్సీలో దాదాపు రూ. 340 కోట్లు) అక్రమంగా తరలించారని ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై విచారణ చేపట్టిన దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు, సాహ్నీ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని నిర్ధారించింది.
విచారణ అనంతరం న్యాయస్థానం సాహ్నీని, ఇతర నిందితులను దోషులుగా తేల్చింది. బల్వీందర్ సాహ్నీకి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల దిర్హమ్ల (సుమారు రూ. 1.14 కోట్లు) జరిమానా విధించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన 150 మిలియన్ దిర్హమ్ల (సుమారు రూ. 340 కోట్లు) విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఐదేళ్ల శిక్షాకాలం పూర్తయిన వెంటనే సాహ్నీని యూఏఈ నుంచి బహిష్కరించాలని తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో శిక్ష పడిన వారిలో సాహ్నీ పెద్ద కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం.
బల్వీందర్ సింగ్ సాహ్నీ ‘రాజ్ సాహ్ని గ్రూప్’ (ఆర్ఎస్జీ) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ యూఏఈతో పాటు అమెరికా, భారత్ వంటి పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దుబాయ్లోని స్పోర్ట్స్ సిటీలో విలాసవంతమైన నివాస, వాణిజ్య భవనాలతో పాటు ఇతర ప్రాంతాలలో బహుళ అంతస్తుల సముదాయాలు, ఫైవ్ స్టార్ హోటల్ వంటి ఆస్తులు సాహ్నీకి ఉన్నాయి. దుబాయ్లోని ఉన్నత వర్గాల్లో ఆయన ‘అబు సబాహ్’గా సుపరిచితులు. విలాసవంతమైన కార్లపై మక్కువ చూపే సాహ్నీ, 2016లో తన రోల్స్ రాయిస్ కారు కోసం ప్రత్యేకమైన నంబర్ ప్లేట్ను ఏకంగా 33 మిలియన్ దిర్హమ్లు (అప్పట్లో సుమారు రూ. 75 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు.