నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi stadium) లో బాంబులు పెట్టాం, బీజే మెడికల్ కాలేజీ (BJ Medical college) లో బాంబులు పెట్టాం అంటూ గుజరాత్కు ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులకు పాల్పడి అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమేగాక, భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆమె నివాసంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న మహిళా ఇంజినీర్Rene Joshilda వరుస బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎందుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డావని ప్రశ్నించిన పోలీసులకు జోషిడా చెప్పిన సమాధానం షాక్కు గురిచేసింది.
తాను ప్రేమించిన విజయ్ ప్రభాకర్ అనే వ్యక్తి తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో మెయిల్ ఐడీలు సృష్టించి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపానని జోషిడా తెలిపింది. బెదిరింపు మెయిల్స్ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించినట్లు చెప్పింది. అయితే తనను గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న జోషిడా.. ఒక చిన్న మిస్టేక్ చేసి దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు.
సదరు మహిళ గుజరాత్తోపాటు మొత్తం 12 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ చేసిందని తెలిపారు. ఆమె తాను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిపై కక్ష సాధిస్తున్నానని మాత్రమే అనుకుంది తప్ప.. తన చర్యలవల్ల వేల మంది అమాయకులు భయబ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయిందని అన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జోషిడా ఒక్క గుజరాత్కే 21 బెదిరింపు మెయిల్స్ పంపిందని, అందులో ఒక్క నరేంద్రమోదీ స్టేడియానికే 13 మెయిల్స్ చేసిందని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా జెనీవా లిబరల్ స్కూల్కు నాలుగు మెయిల్స్, దివ్యజ్యోతి స్కూల్కు మూడు మెయిల్లు, బీజే మెడికల్ కాలేజీకి ఒక మెయిల్ చేసిందని తెలిపారు. గుజరాత్తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు జోషిడా నుంచి బెదిరింపు మెయిల్స్ అందుకున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని పోలీసులు చెప్పారు.