ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పలువురు మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు రోజుల తరబడి తీవ్ర ఆవేదనతో నిరీక్షిస్తున్నారు. వరంగల్కు చెందిన బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ మృతదేహం కోసం అతని బంధువులు ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ వారికి మృతదేహాన్ని అప్పగించలేదు.
మరోవైపు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు స్థానిక ఎస్పీ మహేశ్వర్రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ మేరకు వారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితకు లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ వెళ్లిన కేశవరావు సోదరుడిని ఎస్పీ బలవంతంగా వెనక్కి రప్పించి, వారిపై నిఘా పెట్టి, గృహ నిర్బంధం విధించారని వారు తమ లేఖలో పేర్కొన్నారు. కేశవరావు బంధువులు కోర్టును ఆశ్రయించడంతో, ఛత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కిందిస్థాయి పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఇదే ఎన్కౌంటర్లో మరణించిన భూమిక అలియాస్ వన్నాడ విజయలక్ష్మి (38), కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల లలిత (45) అలియాస్ సంగీత మృతదేహాలను అప్పగించే విషయంలోనూ ఛత్తీస్గఢ్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. భూమిక మృతదేహం కోసం నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లిన ఆమె తండ్రి, బంధువులకు… ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. లలిత మృతి గురించి ఆలస్యంగా తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్కు వెళ్లారు. మృతదేహాల అప్పగింతలో ఈ జాప్యంపై మృతుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి