కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు లోనైన చెందిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 5:30కు కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సి ఉంది.
డ్రైవర్ బస్సును బస్టాండ్లోని పాయింట్ మీదికి తీసుకెళ్లడానికి రెడీ అవుతుండగా.. బస్సు కింద ఉండే బ్యాటరీల నుండి మంటలు వచ్చాయి. అయితే వెంటనే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. డిపోకు చేరుకున్న ఆర్టీసీ అధికారులు ఫైర్ ఇంజన్తో వచ్చిన సిబ్బంది బ్యాటరీలను ఆర్పివేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో బస్సు దగ్ధం కాలేదని.. కొంచెం ఆలస్యం అయ్యుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు తెలిపారు. సకాలంలో అప్రమత్తమై పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.