అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలుకోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలానికి చెందిన టేకులపల్లి వాసులైన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)లు అప్పటికప్పుడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. రోహిత్ రెడ్డి గత 15 సంవత్సరాలనుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆదివారం రోహిత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి బయటకువెళ్లారు. భార్యాపిల్లలతో పాటు అత్త సునీతతో కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ప్రణీత, ఆమె కొడుకు హార్వీన్, సునీతలు స్పాట్ లోనే చనిపోయారు. కారునడుపుతున్న రోహిత్ రెడ్డితోపాటు చిన్నకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంవిషయం తెలిసినవెంటనే ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.