కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు. బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని మూసివేశారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ ఫాంహౌస్ వద్దకు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక్కడికి ఎవరూ రావద్దని పార్టీ హై కమాండ్ ఆదేశించినప్పటికీ కేసీఆర్తో కదిలేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు.
కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. బీఆర్కే భవన్లో కి వెళ్లేందుకు కేసీఆర్ తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది.
ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ ను సైతం పూర్తిచేసింది. తాజాగా కేసీఆర్ను విచారిస్తోంది.