వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్కు తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో వైరా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు.