హైవేలపై రాకపోకలు సాగించే వాహనదారులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను తీసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా ఏడాదంతా రాకపోకలు సాగించొచ్చు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే వార్షిక పాస్ల జారీ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ల జారీ కోసం త్వరలోనే రాజ్మార్గ్ యాత్రా యాప్(Rajmarg Yatra App)తో పాటు ఎన్హెచ్ఏఐ(NHAI), ఎంఆర్టీహెచ్(MoRTH) అధికారిక వెబ్సైట్లలో ప్రత్యేకమైన లింక్ యాక్టివేట్ అవుతుందని గడ్కరీ తెలిపారు. దాని ద్వారానే ఫాస్టాగ్ వార్షిక పాస్ల యాక్టివేషన్, రెన్యూవల్ చేయించుకోవచ్చన్నారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది యాక్టివేట్ చేసుకున్న తేదీ నుంచి ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ వ్యవధిలో దేశంలోని అన్ని జాతీయ రహదారులపై గరిష్ఠంగా 200 వాహన ట్రిప్పులు ప్రయాణించొచ్చు. 200 వాహన ట్రిప్పులు, ఏడాది వ్యవధి.. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటితో ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుబాటు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ రూ.3వేల ఫీజును చెల్లించి, దాన్ని రెన్యూవల్ చేయించుకోవాలి. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ ప్రైవేటు వాహనాల కోసమే ఫాస్టాగ్ వార్షిక పాస్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైవేలపై సగటున ప్రతీ 60 కి.మీ పరిధిలో ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఆయా చోట్ల ఆగకుండా నిరాటంకంగా ప్రయాణాలు సాగించాలని భావించే వారికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రయోజనకరంగా ఉంటుంది. నిత్యం హైవేలపై రాకపోకలు సాగించే వారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. పదేపదే టోల్ ప్లాజాల వద్ద ఆగి, వాహన లైన్లలో ఉండి చెల్లింపులు జరపాల్సిన అవసరం ఉండదు. సింగిల్ పేమెంట్తో ఫాస్టాగ్ వార్షిక పాస్ను తీసుకుంటే, ఏడాదంతా టోల్ ప్లాజాల వద్ద ఆగి చెల్లింపులు జరపాల్సిన అవసరం తప్పుతుంది. వార్షిక పాస్ల జారీ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహన క్యూలైన్లను చాలావరకు తగ్గించొచ్చని కేంద్ర రవాణా శాఖ భావిస్తోంది.
హైవేలపై నిత్యం రాకపోకలు సాగించే ఎంతోమంది ప్రస్తుతానికి నెలవారీ ఫాస్టాగ్ పాస్లను తీసుకుంటున్నారు. ఇంటి చిరునామా వెరిఫికేషన్, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ఈ పాస్లను పొందుతున్నారు. నెలవారీ ఫాస్టాగ్ పాస్ ధర ప్రస్తుతం రూ.340గా ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.4,080 దాకా ఖర్చవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర కేవలం రూ.3వేలే. దీన్ని వాహనదారులు తీసుకుంటే దాదాపు రూ.1,080 దాకా ఆదా అవుతుంది. దీంతోపాటు ఏడాదంతా హైవేలపై నిరాటంకంగా రాకపోకలు సాగించొచ్చు. డబ్బుకు డబ్బు, సమయానికి సమయం ఆదా అవుతాయి. దీన్ని వాహనదారులకు లభిస్తున్న లక్కీ ఛాన్స్గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.