కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.
దేశ రాజధానిలో కాలుష్య నివారణకు ఢిల్లీ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తర్వాత బంకుల్లో ఇంధనం పోయడం నిలిపివేయాలని నిర్ణయించింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.
”పెట్రోల్ పంపుల వద్ద గాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. వాటి సాయంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తాం. వాటికి ఇంధనం సరఫరా ఆపేస్తాం” అని మంత్రి తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా తెలియజేశామని చెప్పారు. ఇంధనం సరఫరా ఆంక్షలతో పాటు, ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సుమారు 90 శాతం సీఎన్జీ బస్సులను దశలవారిగా ఉపసంహరించుకుని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్లు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలు ఉన్నాయని, వాటన్నింటికీ వెంటనె యాంటీ స్మోగ్ గన్స్ను ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్లకు కూడా ఇది వర్తింపజేస్తామని తెలిపారు.