నటి, యాంకర్ అయిన గాయత్రి భార్గవి ఒక రీల్ చేసి తన యూట్యూబ్ చానెల్లో పెట్టారు. సారాంశం ఏమిటంటే తాను iDream Media తరపున వచ్చిన ప్రముఖ యాంకర్, జర్నలిస్ట్ స్వప్నకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చానని, ఆ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందని, ఇంటర్వ్యూలో భాగంగా ఆర్మీలో పనిచేస్తున్న తన భర్తకు ఎదురైన సెన్సిటీవ్ అనుభవాల గురించి చెప్పానని, ఆ క్రమంలో తాను ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నానని, అయితే iDream Media వాళ్లు ఇంటర్వ్యూని అప్లోడ్ చేసే క్రమంలో తన కుటుంబం మొత్తాన్ని డిస్టర్బ్ చేసే థంబ్ నెయిల్స్ పెట్టారని ఆమె ఆరోపించారు. తన భర్త మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోతే, ఆయన బాడీని ముక్కలు ముక్కలు చేసి తన ఇంటికి పంపారనే థంబ్ నెయిల్ పెట్టారని, తాను ఏడుస్తున్న ఫోటోలు పెట్టారని, ఇది తన కుటుంబాన్ని డిస్టర్బ్ చేసిందని, కనుక iDream Media తగు వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె వీడియోకి సమాధానంగా యాంకర్ స్వప్న మాట్లాడుతూ తన పని ఇంటర్వ్యూ చేయడం వరకేనని, మిగతాదంతా టెక్నికల్ టీం చూసుకుంటుందని, తన దృష్టికి వచ్చిన తప్పుడు థంబ్ నెయిల్స్ ని సరి చేయిస్తున్నానని, అయినా ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు మునుపు గాయని సునీత విషయంలో కూడా జరిగిందని, అయినా తానిప్పుడు iDream Media లో పనిచేయటం లేదని ఆమె వివరించారు.
మెయిన్ స్ట్రీం మీడియాలో లేని స్వేచ్ఛ సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ చానెళ్ల ద్వారా జర్నలిజం ప్రాక్టీస్ చేసే ఇండిపెండెంట్ జర్నలిస్టులకి వుంటుంది. ఆ స్వేచ్ఛని పాజిటీవ్ గా వాడుకుంటే సమాజానికి మంచే జరుగుతుంది. అయితే వ్యూయర్స్ సంఖ్య పెంచుకోవడం కోసం వారిని వెంటనే ఆకర్షించాలి కనుక అవాస్తవాలు, అసత్యాలతో కూడిన సంచలనాత్మక థంబ్ నెయిల్స్ పెట్టడం ఎక్కువైంది. తీరా థంబ్ నెయిల్స్ కి ఆకర్షితులై ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తే థంబ్ నెయిల్ కి, సమాచారానికి సంబంధం వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అనైతికం, దిగజారుడుతనం. ఇలాంటి పెడధోరణుల్ని కొనసాగనివ్వని స్పష్టమైన చట్టాలు తయారవ్వాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి ఇది వ్యతిరేకమైనప్పటికీ ఇలాంటివి కొనసాగుతున్నాయంటే అది యూట్యూబ్ వైఫల్యంగానే చెప్పాలి. యూట్యూబ్ ఇలాంటి వక్రమార్గాలను సహించకూడదు. వ్యూయర్స్ కూడా సంచలనాత్మక థంబ్ నెయిల్స్ కి కొట్టుకుపోకుండా తిరస్కరించగలిగితే ఈ పెడధోరణి రూపుమాసిపోతుంది.