హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాక.. ప్రయాణ సమయం ఆదా చేయడం కోసం మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తుంది. సుమారు 150 కోట్ల రూపాయల ఖర్చుతో.. మూడు లేన్లలో ఈ ఫ్లైఓవర్ను నిర్మించాలని భావిస్తుంది. అలానే ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే.. హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ మీదుగా వచ్చే వాహనాలు.. నానక్ రాంగూడ, లింగంపల్లి వైపు సులభంగా వెళ్లవచ్చు. ముఖ్యంగా డీఎల్ఎఫ్ వైపు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు.. దీనిపై స్టడీ చేసేందుకు చెన్నైకి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే వీరు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. దీని ఆధారంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. జూన్ నెలలో దీని పనులు ప్రారంభం కానున్నాయి అంటున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. హెచ్ సిటీపై ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగానే రూ. 7,032 కోట్ల వ్యయంతో 58 పనులు ప్రారంభించింది. దీనిలో 28 ఫ్లైఓవర్ల నిర్మాణం, 13 అండర్ పాస్లు, నాలుగు రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, 3 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనుల రెడీ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో.. కొన్నిటెండర్ల దశలో ఉండగా.. మరికొన్నింటికి టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ స్టేజీలో ఉన్నాయి. త్వరలోనే మొదలు పెట్టబోయే రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ వరకు నిర్మించబోయే ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా హెచ్సిటిలో భాగమే.