యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీల పైనా మర్చెంట్ ఛార్జీల (Merchant Charges)ను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో వెల్లడించింది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యూపీఐ ద్వారా రూ.3,000కు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి స్వస్తి పలకాల్సి ఉంటుంది.
చిన్న మొత్తం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, అధిక విలువ గల లావాదేవీలపై త్వరలోనే మర్చంట్ రుసుము విధించనున్నారు. పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ప్రసక్తి లేదని సమాచారం. బ్యాంకులు, ఫిస్టిక్ సంస్థలు, ఎన్పీసీఐ వంటి వాటాదారులతో సంప్రదింపులు అనంతరం ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. యూజర్లపై ప్రభావం ఉంటుందా?
ఎండీఆర్ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు. మూడేళ్ల ముందు వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రాసెస్ చేసేందుకు వ్యాపారులు కొంతమొత్తం ఛార్జీలను బ్యాంకులకు కట్టాల్సి వచ్చేది. అది కూడా ఒక శాతం లోపే ఉండేది. అయితే, యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను 2022లో కేంద్రం తొలగించింది. అనంతరం ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిస్టిక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వస్తోంది.