అహ్మదాబాద్లో జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రముఖ గుజరాతీ మ్యూజిక్ వీడియో డైరెక్టర్ మహేష్ జీరావాలా (34), అలియాస్ మహేష్ కలావాడియా, మరణించినట్లు డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారికంగా నిర్ధారించారు. ఈ విమానం (ఫ్లైట్ నెం. AI-171) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరి, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీనగర్లోని బీజే మెడికల్ హాస్టల్పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికుల్లో 241 మంది, నేలపై 29 మంది సహా మొత్తం 270 మంది మరణించారు.
మహేష్ జీరావాలా విమానంలో ప్రయాణించలేదు. కానీ ప్రమాద సమయంలో లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి స్కూటర్పై వెళ్తుండగా ఈ దుర్ఘటనలో చిక్కుకున్నారు. ఆయన స్కూటర్, మొబైల్ ఫోన్ ప్రమాద స్థలంలో కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. మొబైల్ లొకేషన్ కూడా క్రాష్ సైట్ సమీపంలో ట్రేస్ అయింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించిన అధికారులు, దానిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మహేష్ గుజరాతీ సినీ పరిశ్రమలో అనేక విజయవంతమైన మ్యూజిక్ ఆల్బమ్లు, చిత్రాలకు దర్శకత్వం వహించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణం గుజరాతీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.