పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో, బుధవారం న్యాయస్థానం (Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్ను దోషిగా చోడవరం న్యాయమూర్తి ప్రకటించి, మరణశిక్షను ఖరారు చేశారు. చోడవరం కోర్టు చరిత్రలో మొదటి సారి ముద్దాయికి ఉరిశిక్ష విధించింది. దేవరాపల్లికి చెందిన గుణశేఖర్ (31)కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి K.రత్నకుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచడం ఇదే ప్రథమం.
గుణశేఖర్ కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు స్కూల్కు వెళ్లి వస్తున్న బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్తో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి గుణశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా విచారణ జరిగి ఈ రోజు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని అంతా భావిస్తున్నారు.
వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు ఉపాధి కోసం అనకాపల్లి జిల్లా వచ్చారు. గొల్లపేట వీధి, దేవరపల్లి గ్రామంలో హోటల్ను నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె వేపాడు దివ్య. వయస్సు ఏడేళ్ళు, స్థానికంగా ఉన్న ఉషోదయ స్కూల్లో UKG చదువుకుంటుంది. తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అలియాస్ తంబిని పనికి కుదుర్చుకున్నారు. గుణశేఖర్ పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉండడంతో, అతని ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి, మురుగన్ దంపతులు గుణశేఖర్ ను పనిలో నుండి తొలగించారు. దీంతో అవమానంగా భావించిన గుణశేఖర్ కక్షకట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అవకాశం కోసం ఎదురుచూసాడు. మురుగన్ ధనలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె చిన్నారి దివ్య హత్యకు ప్లాన్ చేశాడు. అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు గుణశేఖర్పై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదు అయిఉంది.