టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జి.వి రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా చేశారు. గడచిన నాలుగైదేళ్లుగా జి.వి రెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా అప్పటి వైస్సార్ సిపి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రశ్నించడం బాగా చేశారు అని, అతనికి ఈ పదవిని పార్టీ అప్పచెప్పింది. వచ్చిన వార్తల ప్రకారం లోకేష్ గారికి కూడా జి.వి రెడ్డితో మంచి అనుబంధం ఉంది కాబట్టి సులభంగా పదవి దక్కింది అని వార్తలు వచ్చాయి.
మరి మూడు నాలుగు నెలలు కాక ముందే అతను ఎందుకు రిజైన్ చేశాడు? చేసే పరిస్థితిని ఎవరు కలిపించారు వస్తున్న వార్తల ప్రకారం జి.వి రెడ్డి మీడియా సమావేశమే ఈ పరిస్థితికి తీసుకు వచ్చింది అనేది ఒక వాదన. మీడియా సమావేశం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అని కొంతమంది ఐఏఎస్ అధికారులు సీఎంతో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు అని ఒక వాదన ఉంది.
చంద్రబాబు గారి విషయంలో జీ.విరెడ్డి అంచనా తప్పు అయింది అని ఈ ఉదంతం తెలియచేస్తుంది. జి.వి రెడ్డి గత ప్రభుత్వం తప్పులను సరి చేయాలి, పార్టీకి ప్రభుత్వానికి ప్రజల్లో ఇమేజ్ పెంచాలి అనే తొందరలో బాబుగారితో మాట్లాడకుండా ఆ సంస్థ డైరెక్టర్ గురించి మీడియా ముందు మాట్లాడాడు.
ఈ విషయం తెలిసిన బాబు జి.వి రెడ్డిని పిలిచి మందలించాడు. ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని అన్నాడు అని ఈనాడు పత్రికలో వచ్చింది. ఇదంతా జరిగిన తరువాత ఇక పదవిలో ఉంటే గౌరవం ఆత్మాభిమానం ఉండదు అని భావించి జి.వి రెడ్డి పదవికి రాజీనామా చేశాడు. అలాగే తనకు గౌరవం, తన మాటకు విలువ లేనప్పుడు పార్టీలో ఎందుకు అని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు.
పోనీ దీని తరువాత ఆ సంస్థ డైరెక్టర్ ను కొనసాగించారా అంటే అది లేదు. అతన్ని ఆ పదవి నుండి తీసేశారు. ఇలా చేయడం వలన ఇద్దరికీ అన్యాయం జరిగింది అటు ఐఏఎస్ లు, ఇటు జి.వి రెడ్డి పార్టీ శ్రేణులు ఇద్దరు అసంతృప్తికి గురి అయ్యారు. జీవి రెడ్డి రాజీనామా తరువాత బాబు గారు పిలిచి రాజీనామా వెనక్కు తీసుకో అని చెప్పి ఉంటె పార్టీ శ్రేణుల్లో పార్టీ కోసం పని చేసిన వాళ్లకు నమ్మకం గౌరవం పెరిగేది. ఇప్పుడు ఇంత కాలం పార్టీకోసం పని చేస్తే పార్టీ కొరకు నిర్ణయం తీసుకుంటే కనీసం పిలిచి మాట్లాడలేదు అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది.
ఈ విషయంలో టిడిపి పార్టీ ప్రజల్లో చాల మటుకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ పొందింది. ఎందుకంటే జి.వి రెడ్డి నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారు. పార్టీ శ్రేణులు కూడా మంచి పని చేశాడు అని భావించారు. ఇవేవి పట్టించుకోకుండా బాబు గారు తనదైన ఓల్డ్ స్కూల్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టిడిపికి ఓకే ట్రబుల్ షూటర్ అవసరం ఉంది. ఎప్పటి నుండో ఇది మిస్ అవుతూనే ఉంది, ఇప్పుడు కూడా అదే లోటు కనిపిస్తోంది. చూడాలి ముందు ముందు ఏమైనా మారుతుందేమో! మొత్తానికైతే జి.వి రెడ్డి విషయంలో టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా మీడియాలో పెద్ద మొత్తంలో వార్తలు రాశారు.