హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. HCU క్యాంపస్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని పోలీసులు బారిగేట్లతో మూసివేశారు. మరోవైపు, భూముల వేలానికి వ్యతిరేకంగా క్యాంపస్లో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇంకొవైపు, అక్కడ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే విధించినప్పటికీ, కోర్టు ఆర్డర్ కాపీలు అందలేదంటూ అర్ధరాత్రి వరకూ పనులు కొనసాగాయి. మొత్తానికి బుధవారం HCU క్యాంపస్ రణరంగాన్ని తలపించింది.
HCU భూములను ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం మౌనంగా ఉంటూ, ప్రభుత్వానికి సహకరిస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులు అర్థరాత్రి వరకు అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు ఆందోళన చేపట్టారు. భూముల పరిరక్షణ కోసం తమతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని కోరుతూ అందజేసిన మెమొరాండంపై యూనివర్సిటీ యాజమాన్యం మౌనంగా ఉండటంతో అక్కడే బైఠాయించారు.
యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆందోళన కొనసాగించారు. యూనివర్సిటీ భూములను తిరిగి అప్పగించి, యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులు లాఠీదెబ్బలు తింటున్నా యాజమాన్యానికి కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ ఆందోళనకు యాజమాన్యం కూడా మద్దతు తెలపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
HCU క్యాంపస్ను పోలీసులు బుధవారం అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని బారిగేట్లతో మూసివేశారు. క్యాంపస్ దరిదాపులకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఒక్కో గేటు వద్ద పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి, లోపలివారు బయటకు, బయటివారు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈస్ట్ క్యాంపస్ వైపు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, అటువైపు విద్యార్థులు వెళ్లకుండా కట్టడి చేశారు.