హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ మలిభాగం (2 బి) దాదాపు రూ.19వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది. మూడు మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్- మేడ్చల్; జేబీఎస్-శామీర్పేట; శంషాబాద్ విమానాశ్రయం – ఫ్యూచర్సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్(హెచ్ఎఎంఎల్) బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
మూడు మార్గాలకు వేర్వేరుగా డీపీఆర్లను సిద్ధం చేశారు. ఎక్కడా డబుల్ డెక్ ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్-శామీర్ పేట, జేబీఎస్-మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని కసరత్తు జరిగింది. ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించినా స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఎంఎల్ విముఖత చూపింది.
• జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్పేట వరకు 22 కి.మీ. మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ రన్వే. రహదారి పక్కనే ఉండటం, ఎలివేటెడ్ రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో ఇక్కడ సుమారు కిలోమీటరున్నర వరకు భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు.
• జేబీఎస్ నుంచి తాడ్ బండ్, బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కి.మీ. మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతోపాటు శామీర్ పేట ట్రాక్ లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళతాయి. మూడు మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా ఎలైన్మెంట్ ను ఖరారు చేశారు.
• శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్సిటీ వరకు 40 కి.మీ. మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ మెట్రో వెళితే.. అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూ మార్గంలో 18 కి.మీ. వెళ్లేలా డీపీఆర్ సిద్ధం చేశారు.
రెండోదశ రెండో భాగాన్ని సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించేలా ప్రతిపాదించారు. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4 శాతం పీపీపీలో సమకూర్చుకునేలా డీపీఆర్ రూపొందించారు.