మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళిక (సీఎంపీ) సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో జటిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారంగా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి స్కైవాక్లు దోహదపడనున్నాయి. ఇప్పటికే ఉప్పల్ జంక్షన్లో పలు బస్టాపులకు అనుసంధానంగా ఉన్న స్కైవాక్కు మెట్రో స్టేషన్ను కనెక్టివిటీ చేయగా.. జేబీఎస్ (జూబ్లీ బస్స్టేషన్), పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లను కలుపుతూ ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్లు నిర్మించారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్లో 11 టవర్లలో నెలకొని ఉన్న అనేక అంతర్జాతీయ సంస్థలలో పనిచేస్తున్న వారు సులభంగా చేరుకునే విధంగా రహేజా వారు ఒక అధునాతనమైన స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించారు.
ఇదే తరహాలో ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పించాలని తాజాగా హెచ్ఎండీఏలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్లో జరిగిన సీఎంపీ సమావేశంలో కమిషనర్ సర్ఫరాజ్ ఆహ్మద్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ప్లానింగ్, ఉమ్టా అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రస్తుతం రేతిబౌలి బస్టాండ్లోకి స్కైవాక్ ఉండగా.. ఈ స్కైవాక్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు పశ్చిమ వైపు గల మరో సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు అనుసంధానంగా 800 మీటర్ల మేరకు స్కైవాక్ను నిర్మించడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గుతుందని అంచనాలు వేశారు. ఈ ప్రాజెక్టును హెచ్ఎండీఏ లేదా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారంగా 800 మీటర్ల స్కైవాక్ను త్వరలోనే చేపట్టే అవకాశాలున్నాయి.
మెట్రో స్టేషన్ల నుంచి ఇప్పటికే ఎల్అండ్టీ ఆధ్వర్యంలో పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి వారు అభివృద్ధి చేసిన మాల్స్కు స్కైవాక్లు నిర్మించారు. ప్రయాణికులు నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించారు. అదే విధంగా ప్రస్తుతం డాక్టర్ అంబేడ్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మిస్తున్నారు. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ స్కైవాక్ నిర్మిస్తున్నది. అదేవిధంగా మరికొన్ని సంస్థలు నాగోల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి మెట్రో స్టేషన్ల నుంచి ఈ తరహా స్కైవాక్లు నిర్మించడానికి ఎల్అండ్టీతో చర్చలు జరుపుతున్నారు.