తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లను (Betting Apps) ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. బెట్టింగ్ యాప్ ల వలలోచిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్లలో కల్బాయ్ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది.
ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. యూట్యూబ్ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్ యాప్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్ రూపంలో యువతకు వలవేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థికనేరాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.
ఈ క్రమంలో బెట్టింగులు ఆడటం, డబ్బు పోగొట్టుకున్నతర్వాత పోయినచోట వెదుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం, చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుల్లి తెర నటులు, సినీ ప్రపంచంలో అవకాశాలను వెదక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న 11 మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో అజయ్, కిరణ్ గౌడ్, బయ్యాసన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుదీర్ రాజు తదితరులు ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న పలువురు సోషల్మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపై కేసు నమోదుచేశారు. వారిపై 318 (4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.