హైడ్రా ఏకంగా రూ. 2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది హైడ్రా. ఈ ఆపరేషన్లో భాగంగా కొండాపూర్లోని హఫీజ్పేట్లో దాదాపు 17 ఎకరాల్లో ఉన్న భారీ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది శనివారం కూల్చివేశారు.
హైడ్రా కూల్చివేసిన భూములు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందినవి కావడంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెందిన ఆస్తులను హైడ్రా కూల్చివేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే భూముల్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేయడం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైడ్రా అధికారుల వివరాల ప్రకారం.. హఫీజ్పేట్లోని సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు 39 ఎకరాల భూమి ఉంది. ఇందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా.. మిగిలిన 34 ఎకరాలు వసంత కృష్ణ ఆధీనంలో ఉంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించగా.. మిగిలిన 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన KMK సంస్థ భారీ షెడ్లను నిర్మించింది. ఈ షెడ్లలో సినిమా షూటింగ్లకు సంబంధించిన సామాగ్రి ఉంచారు. హైడ్రా అధికారులు ఈ 17 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని.. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు.
హైడ్రా అధికారులు రంగంలోకి దిగి.. వాణిజ్య షెడ్లను నేలమట్టం చేశారు. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే, భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఫామ్ హౌస్ కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. కూల్చివేసిన నిర్మాణాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన కార్యాలయం కూడా ఉంది.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫామ్ హౌస్తో పాటు కార్యాలయాన్ని నిర్మించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగానే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నిర్మాణాలు చేపట్టారని, సర్వే నంబర్ 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అధికారులు వెల్లడించారు.