ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA ) ఇవాళ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్లో ఎటువంటి అణుధార్మికత లీకేజీ (Radiation Leak) లేదని చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎటువంటి రేడియేషన్ రావడం లేదని, లేదా ఆ కేంద్రాల నుంచి ఎటువంటి లీకేజీ కావడం లేదని ఐఏఈఏ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో.. ఇటీవల ఆపరేషన్ సింధూర్ దాడి సమయంలో.. కిరాణా హిల్స్లో ఉన్న అణ్వాయుధ నిల్వ కేంద్రం వద్ద అటాక్ జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అక్కడే అణ్వాయుధ నిల్వలు ఉన్నాయని, వాటి నుంచి స్వల్పంగా లీకేజీ జరగడం వల్ల రేడియేషన్ రిలీజ్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. దీంతో అటామిక్ ఎనర్జీ సంస్థ రంగంలోకి దిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అక్కడ ఎటువంటి న్యూక్లియర్ రేడియేషన్ లేదని ఐఏఈఏ స్పష్టం చేసింది.
పాకిస్థాన్లో అణ్వాయుధ నిల్వలు ఉన్న కిరాణా హిల్స్పై ఇండియా దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలను డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భార్తి కొట్టిపారేశారు. మేం కిరాణా హిల్స్పై దాడి చేయలేదు, అక్కడ ఏం ఉందో మాకు తెలియదని ఆయన మీడియా బ్రీఫింగ్లో తెలిపారు. అయితే సర్గోదా ఎయిర్బేస్పై ఇండియా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ బేస్కు .. న్యూక్లియర్ స్టోరేజీ ఉన్న కిరాణా హిల్స్కు లింకు ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ తిరస్కరించారు.