అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు (Illegal immigration) భారీగా తగ్గినట్లు చెప్పాడు. అక్రమ వలసదారులను ఆయన (Donald Trump) ఆదేశాల మేరకు ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు తిరిగి పంపిన విషయం తెలిసిందే. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని ట్రంప్ వెల్లడించారు. ఇంతటితో అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని అభివర్ణించారు.
ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశంలోకి మూడు లక్షలమంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ (CBP) విడుదల చేసిన నివేదికలను ఉటంకించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్లు వెల్లడించారు. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ట్రంప్ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పుబట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టాయి. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్పం చుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7,287 మంది పట్టుబడ్డారని వెల్లడించింది. అయితే అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనటం నిజం కాదని, కేవలం 65శాతం మాత్రమే తగ్గాయని తెలియజేసింది.
రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన కొందరు భారతీయుల్ని సైనిక విమానాల్లో వెనక్కి పంపించారు. భారత్ కూడా ఆ చర్యలకు మద్దతు పలికింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది.