విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తోటి ఉపాధ్యాయులతో సోదరభావంతో ఉండాల్సిన ఓ ఇన్చార్జి హెచ్ఎం కీచకుడిలా మారాడు. తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేయగా, పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న అదే మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఈ నెల 12న పాఠశాలకు వచ్చిన తోటి ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని బారి నుంచి తప్పించుకున్న సదరు ఉపాధ్యాయురాలు తీవ్ర మనస్తాపం చెంది తోటి ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేసింది.
విషయం బయటపడితే పాఠశాల పరువు పోతుందని, ఇన్చార్జి హెచ్ఎంతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేస్తామని కొందరు ఉపాధ్యాయ సంఘాలనాయకులు బాధిత ఉపాధ్యాయురాలిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోని ఉపాధ్యాయురాలు చట్టప్రకారం ముందుకు వెళ్లేందుకు సిద్ధపడి ఘటన జరిగిన వారం రోజుల అనంతరం పస్రా పోలీస్స్టేషన్లో ఇన్చార్జి హెచ్ఎంపై ఫిర్యాదు చేయగా ఎస్సై కమలాకర్ కేసు నమోదుచేశారు. ఈ విషయమై ఎస్సైని వివరణ కోరగా ఈ నెల 19న బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.