వాషింగ్టన్: భారత్- పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్సోషల్లో శనివారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. “అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయి. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి. అందుకు ధన్యవాదాలు” అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్రమోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్, అసిమ్ మాలిక్ తో మాట్లాడినట్లు చెప్పారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు.