కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విదేశాల్లో ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి
1 శశి థరూర్ (కాంగ్రెస్)
2 రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ)
3 సంజయ్ కుమార్ ఝా (జేడీయూ)
4 బైజయంత్ పాండా (బీజేపీ)
5 కనిమొళి కరుణానిధి (డీఎంకే)
6 సుప్రియా సూలే (ఎన్సీపీ)
7 శ్రీకాంత్ ఏకనాథ్ షిండే (శివసేన)
వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈవిషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తో ఉగ్రవాదం పై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం.
ఈ ప్రతినిధుల బృందం ముఖ్యంగా ఐదు అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.
1. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు
2. పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను ఎలా చేపట్టిందో వివరణ
3. భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత
4. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని స్పష్టతనివ్వడం
5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించడం
కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా.. శశిథరూర్ను ఎంపిక చేసిన కేంద్రం:
కాంగ్రెస్ పంపిన లిస్ట్లో శశిథరూర్ పేరు లేకపోయినా అనూహ్యంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. నిన్న ఉదయం (మే 16) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్తో మాట్లాడినట్లు చెప్పారు. పాక్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాలకు నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరినట్లు చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజ బ్రార్ పేర్లను పంపినట్లు చెప్పారు. కాంగ్రెస్ పంపిన ప్రతిపాదనలో థరూర్ పేరు లేదని వెల్లడించారు. అయితే, కేంద్రం అనూహ్యంగా ఆయన్ని ఎంపిక చేసిందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.