దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య 85,698కు చేరుకొన్నట్టు వివరించింది.
పది మిలియన్ డాలర్ల కంటే (రూ. 87 కోట్లు) ఎక్కువ సంపద కలిగి ఉన్నవారిని మిలియనీర్లుగా పిలుస్తారు. ఇదిలా ఉండగా కుబేరులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటారనుకొంటాం. అయితే, సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టాప్-3లో ఇండియా కూడా ఉన్నట్టు ‘నైట్ ఫ్రాంక్’ నివేదిక వెల్లడించింది. కనీసం రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగినవారిని బిలియనీర్లుగా పిలుస్తాం. కాగా ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరింది.
దేశంలో 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, 104 మంది సంపన్నులతో హైదరాబాద్ ముచ్చటగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నట్టు హురున్ ఇండియా రిచ్లిస్ట్-2024 నివేదికలో వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో 109 మంది, ఏపీలో 9 మంది సంపన్నులు ఉన్నట్టు నివేదిక వివరించింది.