ఐరోపా దేశాల పర్యటనకు ఏటా లక్షలాది మంది విదేశీయులు వెళుతుంటారు. అయితే, Schengen visa దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో తిరస్కరణలు చోటు చేసుకోవడంతో దరఖాస్తుదారులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన వీసా దరఖాస్తులు సైతం లక్షల్లో తిరస్కరణకు గురవుతున్నాయి.
దరఖాస్తుల తిరస్కరణ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
Schengen సభ్యదేశాలకు గత ఏడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు కాండ్ నాస్ట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ దరఖాస్తు రుసుముల ద్వారా రూ.1,410 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా.
భారత్ నుంచి 11.08 లక్షల వీసా దరఖాస్తులు రాగా, వాటిలో 1.65 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది జూన్లో వీసా రుసుమును 80 నుంచి 90 యూరోలకు పెంచిన నేపథ్యంలో, సగటున 85 యూరోలుగా పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.136 కోట్లు నష్టపోయినట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
Schengen Visa అనేది ఐరోపాలోని 29 దేశాలతో కూడిన షెంగెన్ ఏరియా దేశాలలో ప్రయాణించడానికి అనుమతించే వీసా. ఈ దేశాల మధ్య సరిహద్దు నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. ఈ దేశాలలో ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటివి ఉన్నాయి.