ప్రపంచంలో జపాన్ ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. Gross Domestic Product (GDP) 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు. పదో నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అస్థిరత, సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు.
దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే International Monetary Fund (IMF) అంచనాలను ఉటంకిస్తూ.. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్లో మనకంటే ముందు ఉన్నాయని అన్నారు. ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో మూడేళ్లలో జర్మనీని దాటుకొని.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్.. రాబోయే దశాబ్ద కాలంలో భారత చాలా కీలకమన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగు అని పేర్కొన్నారు. దీన్ని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లలోనే భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.