అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (మృత ఆర్థిక వ్యవస్థ) అని విమర్శించిన నేపథ్యంలో, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ ఆ వ్యాఖ్యలను తిరస్కరించారు. భారత్లో ‘ఫాంటాస్టిక్ అవకాశాలు’ (గొప్ప అవకాశాలు) కనిపిస్తున్నాయని, తమ అదృష్టాన్ని భారత్తో పంచుకోవాలనుకుంటున్నామని ఫారెల్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా భారత ఎగుమతులపై 50% సుంకాలు (టారిఫ్లు) విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు, ఆయుధాల కొనుగోలుపై ఆధారపడి విధించబడ్డాయి. గతంలో 25% సుంకాలకు అదనంగా మరో 25% పెంచి మొత్తం 50% చేశారు.
ఫారెల్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా భారత్లో పెట్టుబడులు పెంచడానికి ఆసక్తిగా ఉంది. భారత్ కూడా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని, కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం,” అన్నారు.
ఆస్ట్రేలియాను ‘లక్కీ కంట్రీ’ (అదృష్టవంతమైన దేశం)గా పిలుస్తారు, ఎందుకంటే అక్కడ మినరల్స్, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్స్ వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. “మా అదృష్టాన్ని భారత ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నాము. రెండు దేశాల మధ్య సరఫరా గొలుసులను మెరుగుపరచుకుంటాం,” అని ఫారెల్ తెలిపారు. అడానీ మైనింగ్ ప్రాజెక్టులు, యురేనియం ఎగుమతులు వంటి అంశాల్లో భారత్తో సహకారాన్ని పెంచాలని సూచించారు.
స్వేచ్ఛా వాణిజ్యం, న్యాయపరమైన వాణిజ్యాన్ని విశ్వసిస్తామని, అమెరికా విధించే సుంకాలను సమర్థించబోమని ఫారెల్ అన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA) చర్చలకు తమ ప్రతినిధిని దిల్లీకి పంపామని చెప్పారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడానని, ఈ వారంలో మరోసారి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఈ చర్చలు “ప్రొడక్టివ్”గా జరిగాయని ఫారెల్ పేర్కొన్నారు.


