ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI bank) యూటర్న్ తీసుకుంది. రూ.50వేల కనీసం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. ఇటీవలి నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో తన నిర్ణయం మార్చుకుంది. ఈ మేరకు కనీస సగటు బ్యాలెన్స్ మొత్తాలను సవరించింది. మెట్రో/ అర్బన్ ఖాతాదారులు రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్ కలిగి ఉండాలని పేర్కొంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.7,500 ఉండాలన్న నిబంధన విధించింది. గ్రామీణ ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలానే రూ.2,500 సగటు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుందని పేర్కొంది.
పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా ఎత్తివేయగా.. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదార్లకు ఇటీవల షాకిచ్చిన విషయం తెలిసిందే. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే వర్తిస్తుందని స్పష్టంచేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లు కనీస నిల్వ పరిమితిని రూ.50 వేలకు పెంచేసింది. గతంలో ఈ మొత్తం రూ.10 వేలుగా ఉండేది. సెమీ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. గ్రామీణ ఖాతాదార్లకు రూ.2,500 నుంచి రూ.10 వేలకు సవరించింది. దీనిపై ఆర్బీఐ జోక్యం చేసుకోనప్పటికీ.. పౌరుల నుంచి మాత్రం పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ మొత్తాలను స్వల్పంగా సవరిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది.


