దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని హన్సల్పుర్ మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలి ఇవి కారు ఇ-విటారా (eVITARA)తో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనొ పాల్గొన్నారు. మోదీ ఈ ఈవీ కారును ఫ్లాగ్-ఆఫ్ చేశారు, ఇది భారత్లో తయారైన మొదటి ఈవీ SUVగా 100కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది.
“భారత్ స్వాలంబన సాధించేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు ఇది ప్రత్యేకమైన రోజు. ఇక్కడ ఉత్పత్తి కానున్న కార్లు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయి” అని ఈ కార్యక్రమానికి ముందు మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇ-విటారా (eVITARA) తొలి కారు యూకేకు ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఆ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారుకానున్నాయి. దాంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డజన్ల దేశాల్లో నడిచే ఈవీలపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని రాసి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇది భారత్-జపాన్ సంబంధాల బలాన్ని, భారత్పై గ్లోబల్ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్ కారు ఇ-విటారా (Maruti Suzuki eVITARA) జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారత్ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అప్పుడు వెల్లడించారు. మారుతీ సుజుకీ ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో (49kWh, 61kWh) వస్తోంది. 49 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్పీ శక్తిని, 189 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 61kWh బ్యాటరీ 174 బీహెచ్పీని 189 Nm టార్క్ను విడుదల చేస్తుందని తెలుస్తోంది. అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రదర్శించిన వీడియోలో పేర్కొంది. భారత్లో ఇది సెప్టెంబర్ 3, 2025 నాటికి లాంచ్ కానుంది, మొదటి మార్కెట్గా యూకేలో ఇప్పటికే అందుబాటులో ఉంది.
100 సిటీల్లో ఛార్జింగ్ పాయింట్లు
భారత్ లో ఇ-విటారా తయారీకి రూ.2,100 కోట్లు వెచ్చించినట్లు మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాషి టకేయుచి గతంలో తెలిపారు. మారుతీ సుజుకీ ఈవీలు కొనుగోలు చేసేవారికి స్మార్ట్ హోమ్ ఛార్జర్, ఇన్స్టలేషన్ సపోర్ట్ను అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను అందించనున్నట్లు వివరించారు. ప్రతి 5-10 కిలోమీటర్లకు మారుతీ సుజుకీ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈవీ అడాప్షన్కు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమైన అడ్డంకిగా ఉందని మారుతీ అధికారులు స్పష్టం చేశారు.