యాభై ఏళ్ల క్రితం సగటున ఐదారుగురు పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా, ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మనదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతదేశ జనాభా ఈ ఏడాది 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల, ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్యసమితి తన జనాభా నివేదికలో వివరించింది. యూఎన్ఎఫ్పీఏకు చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాప్యులేషన్ (ఎస్ఓడబ్ల్యూపీ) 2025 నివేదికను మంగళవారం విడుదల చేసింది. భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువ ఉందని దానిలో వెల్లడించింది. జనాభా పెరుగుదల, తగ్గదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభమని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయిందని, భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉందని, అంటే జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావాల్సిన జననాల రేటులో దేశం లేదని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించినా.. యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. 0-14 ఏళ్ల వారు 24 శాతం, 10-19 ఏళ్ల వారు 17 శాతం, 10-24 ఏళ్ల వారు 26 శాతం ఉన్నారని వెల్లడించింది. పని చేసే వయసు (15-64)లో ఉన్న వారు 68 శాతం ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులు మొత్తం జనాభాలో 7 శాతంగా ఉన్నారి, ఆయుర్దాయం అంచనా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని అంచనా వేసింది.
యూఎన్ నివేదికలో ముఖ్యాంశాలు
2025లో ఆయుర్దాయం పురుషులకు 71 ఏళ్లు, మహిళలకు 74 ఏళ్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం దేశ జనాభా 146.39 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో అది 170కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభమవుతుంది. 1960లో భారత జనాభా 43.6 కోట్లు. అప్పుడు మహిళలు సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు సగటున ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు.
సంతానోత్పత్తికి ఎందుకు వెనకాడుతున్నారో తెలుసుకోవడానికి 14 దేశాల్లో 14 వేల మంది (భారత్ నుంచి 1,048) నుంచి ఐరాస అభిప్రాయాలు సేకరించింది. 38% భారతీయులు ఆర్థిక ఇబ్బందుల వల్ల కోరుకున్నంత మంది పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నామని చెప్పారు. అలాగే, ఉద్యోగ భద్రత లేదని 21% మంది, ఇల్లు ఇబ్బంది ఉందని 22% మంది, పిల్లల సంరక్షణకు తగిన సౌకర్యాలు లేవని 18% మంది పేర్కొన్నారు. ఇక అనారోగ్యం కారణంగా 1%, సంతాన సాఫల్యత సమస్యల వల్ల 13%, గర్భిణులకు సంరక్షణ లేమి కారణంగా 14% సంతానోత్పత్తికి దూరంగా ఉన్నారు.
బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో జననాల రేటు ఎక్కువగా ఉండగా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భర్తీ రేటు కంటే తక్కువగా ఉంది. దీనికి ఆర్థిక అసమానతలు కారణమని నివేదిక పేర్కొంది. వేగవంతంగా జనాభా మార్పునకు లోనవుతున్న మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్ను ఐరాస ఉంచింది. జనాభా రెట్టింపు అయ్యే సమయాన్ని 79 ఏళ్లుగా అంచనా వేసింది.