ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ అప్రమత్తతకు తోడు, ‘మేడే’ కాల్ సకాలంలో అందడంతో పెను ముప్పు తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గువహటి నుంచి చెన్నై వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గువహటి నుంచి ప్రయాణికులతో ఇండిగో విమానం చెన్నైకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉన్న విషయాన్ని పైలట్ గుర్తించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు ‘మేడే’ సందేశాన్ని పంపించారు. అత్యవసర పరిస్థితిని తెలియజేసే ఈ కాల్ అందుకున్న ఏటీసీ అధికారులు తక్షణమే స్పందించారు.
సమీపంలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని బెంగళూరులో సురక్షితంగా దించారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగినప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
సాధారణంగా విమానయానంలో ‘మేడే’ కాల్ అనేది అత్యంత తీవ్రమైన ఆపద లేదా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు పైలట్లు ఉపయోగించే రేడియో సందేశం. తాము ప్రమాదంలో ఉన్నామని, తక్షణ సహాయం అవసరమని సమీపంలోని ఏటీసీ కేంద్రాలకు తెలియజేయడానికి దీనిని వాడతారు. ఈ కాల్ ద్వారా ఇండిగో విమానం సురక్షితంగా బయటపడింది.