కన్నవారే పసిపిల్లల్ని చంపే ధోరణి అంతకంతకూ పెరుగుతున్నది. విశాఖపట్టణం అరిలోవ పోలీసుస్టేషన్ పరిధిలో, తన పాప పుట్టుక గురించి మొగుడి అనుమానాలకు ఉక్రోషపడ్డ ఓ తల్లి తన ఐదు నెలల ఆడ పసిబిడ్డని ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి క్రూరంగా చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది కానీ ధైర్యం చాలక తాను చేసిన హత్యని ముందు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి, చివరికి నేరాన్ని అంగీకరించి అరెస్ట్ అయింది. ఈ నెల 13న జరిగిన ఈ ఘటనలో ఇవాళ ఆ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరిలోవ ప్రాంతం పెద్దగదిలో నివసిస్తున్న వెంకటరమణ, శిరీష దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైనప్పటికీ, 12 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. వారికి ఐదు నెలల క్రితమే ఒక ఆడపిల్ల పుట్టింది. ఇన్నాళ్లపాటూ పుట్టని బిడ్డ ఇప్పుడెలా పుట్టిందనే అనుమానం భర్త వెంకటరమణలో మొదలైంది. దాంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి, గొడవలు మొదలయ్యాయి. భార్య శీలం మీద అనుమానం వున్న వెంకటరమణ ఇంట్లో ఓ సీసీ కెమెరా కూడా పెట్టించాడు. ఈ నెల 13న శిరీష బిడ్డ తలపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. హత్య చేసేముందు శిరీష సీసీ కెమెరాని ఆఫ్ చేసింది. బిడ్డ శవాన్ని తెన్నేటి బీచ్ కి తీసుకెళ్లిన శిరీష బిడ్డని సముద్రం నీళ్లల్లో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది, కానీ ధైర్యం చాలక ఆ ప్రయత్నాన్ని విరమించింది. సముద్ర కెరటాలకు బిడ్డ మరణించినట్లు ఫోన్ చేసి చెప్పింది. వెంకటరమణ హుటాహుటీన వచ్చి బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బిడ్డ మరణించినట్లు వైద్యులు చెప్పారు. భార్యపై అనుమానం వున్న వెంకటరమణ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ తన బిడ్డది అనుమానాస్పద మృతిగా అరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోస్ట్ మార్టం రిపోర్టులో బిడ్డ సముద్రం నీళ్లు తాగి కాదు, ఊపిరాడని వత్తిడిలోనే చనిపోయినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా శిరీష నేరం అంగీకరించింది. న్యాయస్థానంలో హాజరుపరచగా శిరీషకి రిమాండ్ విధించారు.
తల్లిదండ్రులు పిల్లల్ని కంటారే కానీ వారిలో ఏ మాత్రమూ శాస్స్త్రీయ అవగాహన వుండదనే విషయంతో పాటు, “శీలం” అనే భావజాలం కారణంగా స్త్రీ ఎంత బలహీనురాలవుతుందనే దానికి ఈ ఘోర ఉదంతం ఓ తార్కాణం. 12 ఏళ్ల తరువాత తమకి బిడ్డ పుట్టే అవకాశం ఉందా అని వెంకట రమణ వైద్యుల ద్వారా తెలుసుకొని వుంటే బహుశా ఈ హత్య జరగకపోయి వుండొచ్చు. బిడ్డ తన వల్ల పుట్టలేదని భర్త సతాయింపుని తట్టుకోలేక ఉక్రోషపడి బిడ్డని క్రూరంగా హత్యచేసిన శిరీష, బిడ్డ అతని వల్లే పుట్టిందని శాస్త్రీయంగా నిరూపించే అవకాశాన్ని పట్టించుకోలేదు. ఇందుకు లైంగిక విద్యారాహిత్యం, శీలం అనేది సామాజికంగా ఓ జీవన్మరణ సమస్య అవడం ప్రధాన కారణాలు. ఏ రోజు ఏ పత్రిక తెరిచినా భార్య శీలం మీద అనుమానంతో హత్య అనే వార్త కనిపించకుండా వుండదు. దేశం యావత్తూ ప్రతి సంవత్సరం వందల వేల సంఖ్యలో ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
మేరా భారత్ నిజంగానే మహాన్ అయ్యేదెన్నడు!!?