ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులు (Israel-Iran War) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei)ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులు జరిపింది. ఖమేనీ నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లు టెహ్రాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఖమేనీ భద్రతకు ప్రమాదం పొంచివుందని అధికారులు భావించారు. దీంతో ఆరోజు రాత్రి ఖమేనీని లావిజాన్లోని బంకర్కు తరలించినట్లు సదరు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. కాగా.. గతేడాది ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేనీ కుటుంబం బంకర్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలాఉండగా.. ఈ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ తొలిరోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ తొలుత భావించినట్లు తెలుస్తోంది. కానీ, అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్ కు మరో అవకాశం ఇవ్వాలని నెతన్యాహు సర్కారు యోచించినట్లు సమాచారం. అందుకే, కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
గత నాలుగు రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించారు. ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, ఆ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతిచెందడం గమనార్హం.