భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) ప్రస్తుతం చంద్రయాన్-4, చంద్రయాన్-5, గగన్యాన్పై పని చేస్తోంది. మరో రెండున్నరేళ్లలో చంద్రయాన్-4 ప్రయోగం చేపట్టనుంది. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ ప్రకటించారు. ఒడిశాలోని భువనేశ్వర్ CTTCలో వర్క్షాప్లను సందర్శించిన ఆయన, ఇస్రో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం ఒడిశా పర్యటనలో ఉన్న ఇస్రో చైర్మన్, భువనేశ్వర్లోని సెంట్రల్ టూల్రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (CTTC)ను బుధవారం సందర్శించారు. ప్రస్తుతం ఇస్రో వద్ద 56 కార్యాచరణ ఉపగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో చాలా వరకు దేశ భద్రత కోసం ఉపయోగిస్తామని చెప్పారు. సరిహద్దు భద్రతతో పాటు ఆహార భద్రత, నీటి భద్రత, టెలి-విద్య, వాతావరణంపై ఇస్రో పనిచేస్తోందని వెల్లడించారు.
“ప్రస్తుతం చంద్రయాన్-4, చంద్రయాన్-5 పై ఇస్రో పని చేస్తోంది. చంద్రయాన్-4 నమూనా సేకరణ మిషన్ రెడీ అవుతుంది. మొదటిసారిగా ఆ మిషన్ చంద్రుని నుంచి నమూనాలను సేకరించి దేశానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత చంద్రయాన్-5ను జపాన్తో కలిసి ప్రయోగిస్తుంది ఇస్రో. చంద్రయాన్-3 ల్యాండర్ బరువు 1600 కిలోలు, రోవర్ బరువు 25 కిలోలు. చంద్రయాన్-5 ల్యాండర్ బరువు 6400 కిలోలు, రోవర్ బరువు 350 కిలోలు. చంద్రయాన్-3 జీవితకాలం 14 రోజులు, చంద్రయాన్-5 జీవితకాలం 100 రోజులు ఉంటుంది” అని వి.నారాయణన్ తెలిపారు.
రాబోయే రెండున్నర సంవత్సరాల్లో చంద్రయాన్-4 ప్రయోగం ఉండనుందని నారాయణన్ చెప్పారు. ఇస్రో గగన్యాన్పై కూడా పని చేస్తోందని అన్నారు. మొదటి అన్క్రూడ్ మిషన్ ఈ సంవత్సరం ఉంటుందని, ఆ తర్వాత 2027 మొదటి త్రైమాసికంలో మరో రెండు సిబ్బందితో కూడిన మిషన్లు అంతరిక్షానికి వెళ్తాయని చెప్పారు. నాసాతో భాగస్వామ్యంలో రెండు మిషన్లు ఉంటాయని చెప్పారు. ఇస్రో అంతరిక్షంలో తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. అంతరిక్ష కేంద్రం బరువు 52 టన్నులు ఉంటుందని చెప్పారు. భారతీయ అంతరిక్ష కేంద్రం 2028లో స్థాపిస్తామని పేర్కొన్నారు.