జీడిమెట్ల (Jeedimetla) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో దారుణం జరిగింది. కసాయి కూతురు కన్న తల్లి అని చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్లో నివాసముండే బాలిక తన ప్రియుడితో కలిసి తల్లి గొంతు నులిమి, తలపై కొట్టి హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందనే కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు, అతని తమ్ముడుతో కలిసి హత్యకు పాల్పడింది. కాగా బాలిక పదవ తరగతి చదువుతోంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ హత్యకు పాల్పడిన అందరూ మైనర్లే కావడం గమనార్హం. ఈనెల 19న ఇంట్లో నుంచి బాలిక తన ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో తన కూతురు కనిపించకపోవడం లేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడు బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో తమ ప్రేమకు అడ్డు వస్తున్న తల్లిని చంపేయాలని కుమార్తె నిర్ణయించుకుంది. ప్రియుడు, అతని సోదరుడి సహాయంతో బాలిక తన తల్లిని హత్య చేసింది.
కాగా ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. తల్లి పూజ చేసుకుంటున్న సమయంలో కుమార్తె ప్రియుడు ఆమె మెడకు చున్నీ బిగించాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో ట్యూషన్ నుంచి మృతురాలి చిన్న కూతురు ఇంటికి వచ్చింది. అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని నమ్మించారు. మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పంపి మరోసారి ప్రియుడిని పిలిపించి సుత్తితో ఆమె తలపై మోది హత్య చేశారు. హత్య సమయంలో కుమార్తె ప్రియుడు.. మృతురాలికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తన తల్లిని కిరాతకంగా హత్య చేస్తున్న సమయంలో ఏ మాత్రం జాలి లేకుండా కూతురు ప్రవర్తించింది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో జీడిమెట్ల పోలీసులు క్లూస్ సేకరించి విచారణ చేస్తున్నారు.
ఇకపోతే మృతురాలు అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్గా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళాబృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్లో ఉన్నారు. అంతేకాదు అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం విశేషం.