కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు చెప్పారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకు వివరించారు. అనుమతులు తీసుకున్నారా లేదా అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలి. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం. మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి? ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. అధికారుల అనుమతి లేకుండా ఎన్ని చెట్లను నరికివేశారో అనే ఆందోళన మాత్రమే ఉంది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. మేము బుల్డోజర్ ఉనికి, 100 ఎకరాల అడవిని తొలగించడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం. మీరు నిర్మించాలనుకుంటే, మీరు అనుమతులు తీసుకొని ఉండాలి అని జస్టిస్ అన్నారు.